మీకు ఒక్కటి మాత్రమే.. మాకు వంద ముంబైలు: పాక్
భారత్లో ముంబై తరహా సంఘటనలు ఒకటి మాత్రమే జరిగాయని, అయితే, ఇలాంటి సంఘటనలను తమ దేశంలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ అభిప్రాయపడ్డారు. భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం గురువారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం సల్మాన్ బషీర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ – పాక్ల మధ్య ప్రధాన అంశం జమ్మూ కాశ్మీర్ అంశమేనన్నారు. కాశ్మీర్ అంశంతో పాటు.. సర్క్రీక్, ఇతర నదీ జలాల పంపిణీ అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. భారత్ తన డిమాండ్లపై తమకు ఉపన్యాసం భారత్ ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తాము సంక్లిష్ట చర్చల పునరుద్ధరణకు కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలకు తీవ్రవాదానికి ముడిపెడితే సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ముంబై దాడులకు సంబంధించి జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదేవిషయాన్ని కోర్టు కూడా స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇకపోతే.. ఉగ్రవాదంపై పోరు సాగించేందుకు భారత్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సల్మాన్ బషీర్ తెలిపారు. పాకిస్థాన్లో శాంతికి విఘాతం కలిగించేందుకు ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత్ వినియోగించుకుంటుందని ఆరోపించారు. దీన్ని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, భారత్ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించబోమని హామీ ఇచ్చారు.