అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకస్మికంగా ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ప్రత్యక్షమయ్యారు. తీవ్రవాదుల బాధిత దేశంగా పేరొందిన ఆప్ఘన్లో ఆయన అనుకోకుండా ప్రత్యక్ష కావడం ఆ దేశ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీవ్రవాదుల అడ్డాగా మారిన ఆప్ఘన్లో తిష్టవేసిన తాలిబన్, అల్ఖైదా తీవ్రవాదులను ఏరివేసేందుకు అమెరికా తన శక్తినంతటిని ప్రయోగిస్తున్న విషయం తెల్సిందే. తాలిబన్ తీవ్రవాదుల అణిచి వేతకు 30 వేలకు పైగా బలగాలను కూడా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో శ్వేతసౌథం అధినేత ఒబామా ఆదివారం అకస్మాతుగా అక్కడ ప్రత్యక్షం కావడం గమనార్హం. వాషింగ్టన్ నుంచి ప్రత్యేక విమానంలో కాబూల్కు చేరుకున్న ఆయన.. ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాఫ్టర్లో ఆప్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ అమెరికా, అప్ఘన్ అధ్యక్షుల సమావేశం జరిగింది. వీరి చర్చలకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడి కాలేదు. అలాగే, ఒబామా ఆకస్మిక పర్యటన వెనుక కారణాలు తెలియాల్సి వుంది.
తన పరిపాలనా సౌలభ్యం కొరకు నామినేట్ చేసే 15 మంది సభ్యుల నియామకం కోసం విచక్షణాధికారాలను వినియోగించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. అయితే, నామినేట్ చేసే సభ్యుల నియామకాన్ని ఆమోదించడంలో సెనేట్ తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ సభ్యుల్లో భారత సంతతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సిద్ధిక్యూకు కూడా చోటు దక్కనుంది. అధ్యక్షుడు నామినేట్ చేసే సభ్యులను ఆమోదించడం లేదా తిరస్కరించే అధికారం సెనేట్కు ఉంది. అందువల్ల తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఈ సభ్యుల నియామకాన్ని నామినేట్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ సభ్యుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సిద్ధిక్యూ వృక్షశాస్త్రంలో బీఎస్ చేశారు. ప్రస్తుతం కార్ప్లైఫ్ అమెరికాలో సైన్స్ అండ్ రెగ్యులేటరీకి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్లింటన్ హయాంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. వ్యవసాయ శాఖలో పలు కీలక పదవులను ఆయన అలంకరించారు.